Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మెనూ పక్కాగా అమలు చేస్తూ విద్యార్థిని లకు నాణ్యమైన ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ బంగ్లా సమీపంలో ఉన్న ప్రభుత్వ బి.సి. బాలికల సంక్షేమ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వసతిగృహంలో భోజనం మెనూ ప్రకారం అందించాలని, అలాగే వసతిగృహంలో పరిశుభ్రతను పాటించాలని అధికారులకు సూచించారు. తనిఖీలో భాగంగా కలెక్టర్ వసతి గృహంలోని కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, డార్మిటరీ గదులు, మరుగుదొడ్లు, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారికి డైట్ ప్రకారం రుచికరమైన, పోషకాహారం అందుతున్నదా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో ఉన్న విద్యార్థుల సంఖ్య, గదుల సంఖ్య, విద్యార్థులు ఎలా చదువుతున్నారు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ, ప్రస్తుతం వసతి గృహంలో సుమారు 250 మంది బాలికలు నివసిస్తున్నామని, అయితే డార్మిటరీ గదులు తగినంతగా లేవని తెలిపారు. దీనిపై స్పందించిన కలెక్టర్ పంచాయతీ రాజ్ ఈ ఈ కి పరిశీలించేందుకు తగు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా చూడాలని, తాగునీటిలో పి.పి.ఎం శాతాన్ని తరచూ పరీక్షించాలని సిబ్బందిని ఆదేశించారు. టెన్త్ క్లాస్ చదువుతున్న ఒక విద్యార్థిని మాట్లాడుతూ, తాము మార్కెట్ రోడ్ పాఠశాలలో చదువుతున్నామని, తెలుగు, హిందీ, బయో సైన్స్ ఉపాధ్యాయుల కొరత ఉందని తెలిపారు. ఈ విషయంపై కూడా సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడతానని కలెక్టర్ తెలిపారు.అదనంగా, వసతి గృహంలోని బోర్వెల్ మరమ్మతులు, సీసీ కెమెరాల వ్యవస్థ, సిబ్బంది పనితీరు తదితర అంశాలపై కూడా కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్, డైట్ మెనూను కచ్చితంగా అమలు చేయాలని, సమయపాలన పాటించాలని, వసతి గృహంలో పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని సిబ్బందికి ఆదేశించారు.
Admin
Abhi9 News