Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : రహదారి ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ అన్నారు. ఇందుకుగాను తక్షణ చర్యలతో పాటు, శాశ్వత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బుధవారం తన చాంబర్లో నిర్వహించిన రహదారి భద్రత జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్ అండ్ బి ,పంచాయతీరాజ్ రహదారులతో పోలిస్తే జాతీయ రహదారులపై ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని ,జిల్లాలో ని అన్ని రహదారులపై ప్రమాదాలు జరిగేందుకు ఎక్కువ ఆస్కారం ఉన్న 25 హాట్ స్పాట్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని ,ఈ కేంద్రాలలో ప్రమాదాలను అరికట్టేందుకుగాను అవసరమైన సైన్ బోర్డులు, రేడియం స్టిక్కర్లు వంటివి ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా జాతీయ రహదారుల సంస్థ 44 వ జాతీయ రహదారి పై ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రహదారుల పై ప్రమాదాలకు గురైన వారికి తక్షణ వైద్య చికిత్సలు అందించే నిమిత్తం జాతీయ రహదారిపై గుర్తించిన కేంద్రాలలో "ట్రామా" కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు తక్షణమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణను ఆదేశించారు. జాతీయ రహదారిపై ఎక్కడైనా ప్రమాదాలు సంభవించినప్పుడు పోలీసు అధికారులతో పాటు, జాతీయ రహదారుల సంస్థ ప్రతినిధులు సైతం ఉండాలని ఆదేశించారు. ప్రమాదాల నివారణలో భాగంగా రహదారులపై రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు ఎన్ఫోర్స్ మెంట్ కార్యక్రమాలను చేపట్టాలని, పోలీస్, రహదారుల అధికారుల సహకారంతో వీటిని నిర్వహించాలని ఆర్టీవో నరేష్ ను ఆదేశించారు. జాతీయ రహదారికి కలిసే పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి సర్వీస్ రోడ్ల వద్ద స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖల ఎక్జిక్యూటీవ్ ఇంజనీరింగ్ అధికారులు స్వామి, నరేందర్ రెడ్డిని ఆదేశించారు . జిల్లా ఎస్పీ కే. నరసింహ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రహదారి ప్రమాదాలు పెరుగుతున్నాయని ,అదేవిధంగా చనిపోతున్న వారి సంఖ్య సైతం పెరుగుతూ వస్తున్నదని, అందువల్ల ప్రతి ఒక్కరు రహదారులపై జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రత్యేకించి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలలో చనిపోయేవారి సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉందని అంబరు. ఈ సంవత్సరం అన్ని రహదారులలో కలిపి జిల్లాలో ఇప్పటివరకు 127 మంది చనిపోయారని ఆయన వెల్లడించారు. గత సంవత్సరం ఈ సంఖ్య 118 ఉందని, అందువల్ల కనీసం 10% మరణాలను తగ్గించిన ఆయా కుటుంబాలకు మేలు చేసిన వారం అవుతామని ఆయన తెలిపారు. ముఖ్యంగా రహదారులలో జంక్షన్లు, క్రాసింగ్ ల వద్ద ఎక్కువ ప్రమాదాలు సంభవించడానికి అవకాశం ఉందని, జాతీయ రహదారిపై పాదాచారులు ఎక్కువగా ప్రమాదాలకు గురై చనిపోతున్నారని, అలా జరగకుండా ఉండేందుకు రహదారుల సంస్థ సైన్ బోర్డుల తో పాటు, పనులు జరుగుతున్న చోట ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగకుండా అవసరమైనచోట యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని ,అదేవిధంగా శాశ్వత చర్యలు చేపట్టాల్సిందిగా కోరారు. ఏఎస్పి రాములు, డి.ఎస్.పి మహేష్, ఎక్సైజ్ సూపరిండెండెంట్ సైదులు ,జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణ, పంచాయతీరాజ్ ఈ ఈ నరేందర్ రెడ్డి, ఆర్ అండ్ బి ఈ ఈ స్వామి,డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ, మున్సిపల్ కమిషనర్లు, ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి తదితరులు హాజరయ్యారు.
Admin
Abhi9 News