Abhi9 News - తెలంగాణ / Hyderabad : మహారాష్ట్ర నుంచి తెలంగాణ, కర్ణాటక మీదుగా సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని భారత వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 21 సెం.మీ.కు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మరోవైపు బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ప్రస్తుతం వాయవ్య, మధ్య బంగాళాఖాతం సమీపంలో పూరీ తీరానికి దక్షిణ ఆగ్నేయంగా 60 కి.మీ దూరంలో, గోపాల్పూర్నకు తూర్పుదిశలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా వాయవ్య దిశగా పయనిస్తూ, పూరీ, కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జనగాం, నిర్మల్, భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్, మహబూబ్నగర్, మెదక్, ములుగు, నాగర్కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. గురువారం అర్ధరాత్రి నుంచే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. శుక్రవారం కూడా భారీ వర్షం కురవటంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా రోడ్లన్నీ జలమయమై పలుచోట్ల భారీ ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. దీంతో ప్రజల భద్రత, ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగం అప్రమత్తమై, వివిధ కంపెనీలకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రధానంగా ఆల్విన్ కాలనీ, చార్మినార్, యూకత్పురా, ఓయూ క్యాంపస్, హైదర్నగర్, వివేకానంద నగర్, ఛత్రినాక, తార్నాక, హబ్సిగూడ, నాచారం, లాలాపేట్, మల్లాపూర్, బషీర్బాగ్, అబిడ్స్, కోఠి, ఉప్పుగూడ, బార్కస్, చాంద్రయణగుట్ట, బహదూర్పురా, కూకట్పల్లి, జేఎన్టీయూ, బాచుపల్లి, నిజాంపేట్, ప్రగతినగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మియాపూర్ మంజీరా పైపులైన్ రోడ్డు నుంచి కొండాపూర్ మైహోం మంగళ మార్గంలో రైల్వే అండర్ పాస్లోకి వరదనీరు చేరడం వల్ల ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Admin
Abhi9 News