Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : వ్యవసాయానికి రైతులకు 24గంటల కరెంటు అవసరం లేదా... కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లు మూడు గంటల కరెంటు సరిపోతుందా... అని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నదాతలను ప్రశ్నించగా... మూడు గంటల కరెంటు కనీసం తూకాలకు కూడా సరిపోదని, తమకు 24 గంటల నిరంతర నాణ్యమైన కరెంటు కావాలని, కరెంటు వద్దన్న కాంగ్రెస్ నాయకులను పొలిమేర వద్దనే తరిమికొడతామని హెచ్చరించారు. హన్వాడ మండలం దాచకపల్లి గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం... గ్రామ కూడలిలో ప్రజలను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. తామంతా ఊర్లు బాగు చేసుకుంటూ తిరుగుతుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. 2014కు ముందు కనీసం కరెంటు ఇవ్వని నాయకులు ఇప్పుడు రైతు సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేక పోతున్నారని అన్నారు. రైతులు సంతోషంగా ఉంటే కాంగ్రెస్ నాయకులు కళ్ళు మండి కుట్రలు చేస్తున్నారన్నారు. రైతుబంధు, 24 గంటల కరెంటు, రైతు బీమా వంటి ఎన్నో పథకాలతో అన్నదాత ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాడని తెలిపారు. కరెంటు అంశంలో కారుకూతురు కూర్చున్న కాంగ్రెస్ నాయకులను క్షమాపణ చెప్పిన తర్వాతే గ్రామాల్లోకి అనుమతించాలన్నారు. ఇప్పుడు రెండు పంటలు పండించుకున్న అన్నదాతలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఏర్పడిన తర్వాత సంతోషంగా మూడు పంటలు పండించుకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి ఎండాకాలం కూడా చెరువులు, వాగులు, వంకల్లో జలకళ ఉండేలా చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, జెడ్పిటిసి విజయనిర్మల రమణారెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కరుణాకర్ గౌడ్, వైస్ ఎంపీపీ లక్ష్మీ మోహన్ నాయక్, సర్పంచ్ బాలకిష్టారెడ్డి, ఎంపీటీసీ అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Abhi9 News