Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలోని ప్రభుత్వ బడుల రూపురేఖలు మారిపోతున్నాయని... కార్పొరేట్ స్కూళ్లను తలపిస్తున్నాయని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హన్వాడలో మన ఊరు మనబడి పథకం ద్వారా అభివృద్ధి చేసిన ప్రభుత్వ పాఠశాలను చూసి అచ్చం కార్పోరేట్ పాఠశాలల ఉందంటూ ఢిల్లీ నుంచి అధ్యయనం కోసం వచ్చిన కేంద్ర బృందం ఆశ్చర్యపోయిందని మంత్రి పేర్కొన్నారు. బుధవారం నాడు జిల్లా కేంద్రంలోని షాసాబ్ గుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భారత సేవాశ్రమ సంఘం ఆధ్వర్యంలో షా సాబ్ గుట్ట ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు... షాసాబ్ గుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధి కోసం మన ఊరు మన బడి పథకం కింద రూ. 50 లక్షలు మంజూరు చేశామని... వచ్చే ఏడాది లోగా ఈ పాఠశాల సైతం సర్వాంగసుందరంగా తయారవుతుందని తెలిపారు. విద్యార్థుల సంఖ్య పెరిగిందని... పక్కనే ఉన్న బీడీ కళాశాలలో నిరుపయోగంగా ఉన్న గదులను తమ కేటాయించాలని పాఠశాల ఉపాధ్యాయులు కోరగా... వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి విద్యార్థులకు అసౌకర్యం లేకుండా చూడాలని ఆదేశించారు. ఎన్ని నిధులైన కేటాయించి విద్యార్థులకు చక్కని సౌకర్యాలు అందుబాటులోకి తెస్తామన్నారు. మహబూబ్ నగర్ లో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. స్థానికంగా ట్యాంక్ బండ్ వద్ద హైదరాబాద్ వండర్ లా మాదిరిగా మినీ వండర్ లా ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. లండన్ ఐ తరహాలో అతిపెద్ద జాయింట్ వీల్ ఎంతో ఆకట్టుకుంటుందని అన్నారు. సస్పెన్షన్ బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యాయి నెలరోజుల్లో పూర్తవుతాయన్నారు. కార్యక్రమంలో భారత సేవాశ్రమ సంఘం అధ్యక్షుడు మునీశ్వర నంద స్వామీజీ, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, రెడ్ క్రాస్ ఛైర్మన్ నటరాజ్, కౌన్సిలర్లు కట్ట రవి కిషన్ రెడ్డి, తిరుమల రోజా వెంకటేష్, పాపారాయుడు, తాసిల్దార్ పార్థసారథి, ప్రధానోపాధ్యాయుడు సాయిబాబా, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Admin
Abhi9 News