Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : పోడు భూముల పట్టాల పంపిణీ తో గిరిజనులలో భూమి నాది అనే హక్కును కల్పించామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం అయన మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో 19 మంది గిరిజన లబ్ధిదారులకు 13.02 ఎకరాల పోడు భూములకు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాలకు చేస్తున్న కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేవని అన్నారు.గిరిజనులు కొన్ని ఏళ్లుగా పోడు భూములు సాగు చేసుకుంటున్నప్పటికీ హక్కులు కల్పించలేదని, అలాంటిది తమ ప్రభుత్వం పోడు భూములకు పట్టాలను పంపిణీ చేసి భూమి నాది అనే హక్కును గిరిజనులకు కల్పించడం జరిగిందని, దీని ద్వారా గిరిజన రైతులకు రైతుబంధు తో పాటు, ఇతర పథకాలు వర్తిస్తాయని, సొంతంగా బోరుబావులు, ఇతర సౌకర్యాలు కల్పించుకునే అవకాశం దొరికిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడం జరిగిందని, తండాలలో హమారాతాండ హమారా రాజ్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగిందని, ఇంటింటికి మిషన్ భగీరథ తాగునీటితో పాటు, తండాలలో సైతం గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం, తారు రోడ్లు నిర్మించామని, అంతేకాక ఇతర ప్రాంతాలలో మాదిరిగానే తాండ ప్రజలకు అన్ని పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమంలో భాగంగా హైదరాబాదులో బంజారా భవన్ కట్టించడం జరిగిందని, పెన్షన్లు ,రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి వంటి పథకాలను అమలు చేస్తున్నాదని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కి రైతుల పట్ల ఎనలేని ప్రేమఉందని, రెండు ఎకరాలు ఉన్న రైతు సైతం ఇప్పుడు 2 పంటలు పండిస్తున్నాడని, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి అయితే పాలమూరు నీటిని కాలువలు, చెరువుల ద్వారా నింపి సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాలో 12 కోట్ల రూపాయలతో సేవాలాల్ మహారాజ్ దేవాలయం తో పాటు, గిరిజనుల హాస్టల్, గిరిజన భవన్ కట్టించడం జరిగిందని ,గిరిజనులకు పోడుభూములతో భరోసా కల్పించామని వెల్లడించారు. భవిష్యత్తులో పోడుభూములు పొందిన రైతులకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా బోర్లతో పాటు ,విద్యుత్ కనెక్షన్, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. అంతకుముందు మంత్రి 10 లక్షల రూపాయల వ్యయంతో తహసిల్దార్ కార్యాలయ పై ఫ్లోర్లో నిర్మించిన సమావేశ మందిరాన్ని ప్రారంభించారు. అంతేకాక తహసిల్దార్ కార్యాలయ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించగా 66 మంది రక్తదానాన్ని చేశారు. ఈ సందర్భంగా మంత్రి 8 మందికి ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్, ఎంపీపీ బాలరాజు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రు నాయక్, జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణ, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి మధుసూదన్ గౌడ్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఇందిర, తహసిల్దార్ బక్క శ్రీనివాస్, ఎంపిడిఓ ధనుంజయ్ గౌడ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు లయన్ నటరాజ్, ఇతర అధికారులు ,ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Admin
Abhi9 News