Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం నాడు స్థానిక కొత్త గంజి సమీపంలో ఉన్న ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత ముస్లిం సోదరులకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... బక్రీద్ త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుందని, మనకు కలిగిన ప్రయోజనాలను జనులందరికీ సమానంగా అందించినపుడే సార్థకత చేకూరుతుందనే సందేశాన్ని ఈ పండుగ ఇస్తుందని మంత్రి తెలిపారు. బక్రీద్ భక్తి, త్యాగం, కరుణ, విశ్వాసం అనే గొప్ప గుణాలను ప్రజల్లో పెంపొందిస్తుందని అన్నారు. అల్లా దయ ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖశాంతులతో వర్థిల్లాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పండుగలన్నీ సుఖసంతోషాలతో జరుపుకుంటున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు మహబూబ్ నగర్ లో పండుగలప్పుడు స్నానం చేసేందుకు నీళ్లు కూడా లభించే పరిస్థితి ఉండేది కాదని... రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆ సమస్యలన్నీ తీరాయన్నారు. ఎన్నికలప్పుడు పండుగలు వచ్చాయంటే ఎప్పుడు ఏ ఆందోళన జరుగుతుందోనని భయం భయంగా ఉండేదని... ఇప్పుడు హిందూ ముస్లిం భాయి భాయి అన్న తీరుగా పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చేశామన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ మరింత అభివృద్ధి సాధించాలని ఈ సందర్భంగా మంత్రి ఆకాంక్షించారు. కార్యక్రమంలోఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రహమాన్, వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, ఎస్పీ కె నరసింహ, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, డీఎస్పీ మహేష్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
Admin
Abhi9 News