Abhi9 News - తెలంగాణ / సంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాదం ఘటన ఎంతటి విషాదాన్ని నింపిందో అందరికీ తెలిసిందే. బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టడంతో అందులోని కంకర బస్సులో పడి దాదాపు 19 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరువక ముందే తెలంగాణలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. దీంతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జాతీయ రహదారి 65 సమీపంలో పటాన్చెరు మండలం ముత్తంగి వద్ద ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. ముందు ఉన్న కారును తప్పించబోయి బ్రేక్ ఫెయిల్ అవడంతో బస్సు డివైడర్పైకి దూసుకెళ్లి విద్యుత్ స్తంభానికి ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ప్రయాణికులు ఎవరూ కూడా గాయపడకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదానికి గురైన బస్సు మేడ్చల్ డిపోకు చెందింది. మేడ్చల్ నుంచి ఇస్నాపూర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పటాన్చెరు పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. బస్సులో సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. అయితే ఆర్టీసీ బస్సులకు వరుసగా జరుగుతున్న ప్రమాదాలతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి.
Admin
Abhi9 News