Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : గోవులను పూజిస్తే సమస్త దేవతలను పూజించిన వ్రత ఫలితం అందుతుందని, ఆషాడ మాసంలో చాతుర్మాస గోపద్మ వ్రతం సుమంగళీ స్త్రీలు చేయడంతో అష్టైశ్వర్యాలు, గ్రహదోష పీడ నివారణలు ఏకకాలంలో చేసుకోవచ్చని వేద పండితులు తిరునగరి పవనాచార్యులు అన్నారు. శుక్రవారం నాడు జిల్లా కేంద్ర సమీపంలోని కొల్లాపూర్ చౌరస్తా దగ్గర గల శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలోనీ గోశాలలో ఆషాడ మాస శుక్ల పంచమి రోజు సామూహికంగా గోపద్మవ వ్రతాన్ని వేద బ్రాహ్మణుల బృందంచే శాస్త్రోక్తంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 168 మంది మహిళలు సామూహిక గోపద్మ వ్రతంలో పాల్గొని వ్రతాలు నిర్వహించారు. మహాభారత కాలంలో ద్రౌపది దేవి అప మృత్యుదోషం నివారణకు గోపద్మ వ్రతం ఆచరించిందని అన్నారు. గో వ్రత కార్యక్రమంలో భాగంగా గణపతి పూజ పుణ్యావాచనం రక్షాబంధనం, ద్వాదశ ఆదిత్యులు, ఆదిత్య వాసువులు, ఏకాదశరుద్రులు, లక్ష్మీ, దుర్గ, పార్వతి, సరస్వతి దేవతల ఆహ్వానది షోడాషా ఉపచర పూజలు, వేదమంత్రో చరణాల మధ్య అర్చక బృందం శాస్త్రోక్తంగా పూజలు చేశారు. లలిత సహస్ర పారాయణ కమిటీ మహిళా సభ్యులచే సామూహిక లలిత సహస్ర నామ పారాయణంను పఠించారు. ఈ వ్రతం ఆచరించడంతో గ్రహదోష నివారణ, యశస్సు కీర్తి లబ్ధి, వాస్తు దోష నివారణ, అష్టైశ్వర్యాలు కలిగి ఆర్థిక వ్యాపార అభివృద్ధి విశేష పుణ్యఫలితం ఉంటుందన్నారు. అనంతరం ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలతో పాటు సామూహికంగా ఏర్పాటుచేసిన అన్న ప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో సరస్వతి దేవాలయ కమిటీ అధ్యక్షులు ఆకారపు విశ్వనాథం, ప్రధాన కార్యదర్శి ఎలిమేఈశ్వరయ్య, మహిళా కార్యదర్శి దొడ్ల ఇందుమతి ఈశ్వర్ రెడ్డి, గోశాల అధ్యక్షులు దొడ్ల నారాయణరెడ్డి, కమిటీ సభ్యులు లగిశెట్టి వరలక్ష్మి,రవికుమార్, బాలస్వామి, భూపాల్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు పెంటమ్మరాజు నవీన్ కుమార్ శర్మ, రంగాచార్యులు, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Abhi9 News