Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు" అన్న స్థాయి నుండి "నేను పోత బిడ్డో సర్కారు దవఖానకు" అన్న స్థాయికి ప్రభుత్వ ఆసుపత్రులను తీసుకువచ్చామని రాష్ట్ర ఎక్సైజ్,క్రీడలు,సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం అయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన "తెలంగాణ రేడియాలజీ హబ్ "ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఒకప్పుడు మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖాన దుర్గంధంతో నిండి ఉండేదని, నెలలో కనీసం 20 కాన్పులు అయ్యేవి కాదని, ఒకే ఒక్క ఫార్మసీస్టు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, 25 మంది నర్సులు ,30 మంది పనివారు ఉండేవారని, అలాంటిది ఇప్పుడు 37 మంది ఫార్మసిస్టులు, 44 మంది ల్యాబ్ టెక్నీషియన్లు ,250 మంది నర్సులు, అలాగే వర్కర్ల సంఖ్యను పెంచుకోవడం జరిగిందని, ఐసియు బెడ్లతో సహా ,ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అత్యంత అధునాతన టెక్నాలజీతో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన తెలంగాణ రేడియాలజీ హబ్ ను ప్రారంభించుకున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక మొట్టమొదటి మెడికల్ కళాశాలను మహబూబ్ నగర్ కు తీసుకువచ్చామని, దీంతోపాటు నర్సింగ్ కళాశాల, పారామెడికల్ కళాశాల, అదేవిధంగా ఫిజియోతెరఫీ కళాశాలను తీసుకురావడం జరిగిందని వెల్లడించారు. ప్రైవేట్ హాస్పిటళ్లకు దీట్లుగా మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దుతున్నామని, అన్ని సౌకర్యాలతో పాత కలెక్టరేట్ స్థానంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నామని, ఒక సంవత్సరంలోపే దానిని పూర్తి చేస్తామని, మహబూబ్ నగర్ లో ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ వైద్యాన్ని అందిస్తామని, గతంలో సర్కార్ దవఖానకి వెళ్లాలంటే ప్రజలు భయపడి నేను రాను బిడ్డ సర్కారు దావకానకి అనే పరిస్థితి ఉండేదని, అలాంటిది ఇప్పుడు నేను వస్తాను బిడ్డ సర్కారు దవఖానకు అనే పరిస్థితికి తీసుకువచ్చామని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నెలకు 1000 కాన్పులు ఆవుతున్నాయని ,వీటిలో 80 శాతం సాధారణ ప్రసవాలు అవుతున్నాయని, వైద్య రంగంలో అత్యంత పెను మార్పులను తీసుకువచ్చామని, 500 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తయితే ఒక మహబూబ్ నగర్ నుండే కాక కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు తదితర జిల్లాల నుండి మహబూబ్ నగర్ కు వైద్యానికి వస్తారని ఆయన అన్నారు. వైద్యులు వైద్య సిబ్బంది, నర్సులు డాక్టర్లు అంకితభావంతో పనిచేయాలని, మదర్ తెరిసా లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని, సేవాభావంతో నడుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు . సమావేశానికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ రాంకిషన్ అధ్యక్షత వహించగా, ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ రమేష్, హెచ్ ఓ డి ప్రిన్సిపల్ డాక్టర్ రాధా డాక్టర్ కిరణ్,డాక్టర్ జీవన్, డిఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ ,ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు లక్ష్మీ, సత్యం యాదవ్ ,మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ ,మున్సిపల్ కౌన్సిలర్లు, టి ఎస్ ఎం ఐ డి సి ఈ ఈ జైపాల్ రెడ్డి ,డాక్టర్లు ,సిబ్బంది ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
Admin
Abhi9 News