Abhi9 News - తెలంగాణ / Hyderabad : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలో నిలవాలని ఆశించే అభ్యర్థులను ముగ్గురు పిల్లల నిబంధన తీవ్రంగా వెంటాడుతోంది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం- 2018 అనుసరించి జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచి, వార్డు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ముగ్గురు పిల్లలు కలిగి ఉంటే పోటీకి అనర్హులుగా పరిగణిస్తారు. ఈ నిబంధన ఆంధ్రప్రదేశ్లో ఇటీవలే తొలగించినా, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కొనసాగుతూనే ఉంది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి తప్పకుండా 21 సంవత్సరాల వయసు నిండాలి. తెలంగాణలోనూ ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేయాలని రాజకీయ నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. నిబంధన వివరాలు ఇలా 31.5.1995 కంటే ముందు ముగ్గురు పిల్లలున్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ఈ తేదీ నాటికి ఇద్దరు పిల్లలుండి, తర్వాత మరో సంతానం కలిగితే పోటీకి అనర్హులుగా పరిగనిస్తారు. 1.6.1995 తర్వాత ముగ్గురు పిల్లలు కలిగిన వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అస్సలు వీలుండదు. ఇద్దరు పిల్లలున్నవారు మాత్రమే పోటీ చేయడానికి అర్హులు. 31.5.1995కు ముందు ఒక సంతానం కలిగిన తర్వాత కాన్పులో కవల పిల్లలు జన్మిస్తే పోటీకి అర్హులే అవుతారు. ఇదే తేదీకి ముందు కవలలు జన్మించి, తర్వాత జరిగే కాన్పులో ఒకరు జన్మించినా అనర్హులే అవుతారు. 1.6.1995 తర్వాత మొదటి కాన్పులో ఒకరు, రెండో కాన్పులో కవలలు జన్మిస్తే పోటీ చేయవచ్చు. 1.6.1995 తర్వాత ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించినా పోటీకి ఎలాంటి ఇబ్బందులుండవు. ఒక వ్యక్తి తన మొదటి భార్య ద్వారా ఇద్దరు, భార్య మరణించిన తర్వాత రెండో భార్య ద్వారా మరో సంతానం పొందినట్టయితే పోటీకి అనర్హులవుతారు. ఒకరు లేదా ఇద్దరు పిల్లలకు తల్లి అయిన మహిళ మాత్రం పోటీకి అర్హులే. ముగ్గురు పిల్లలు కలిగి ఉన్నా నామపత్రం పరిశీలనకు ముందే వారిలో ఒకరు మరణిస్తే జీవించి ఉన్న పిల్లల లెక్కను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. నామినేషన్ పరిశీలన రోజుకు ఇద్దరు పిల్లలు కలిగి, మళ్లీ గర్భం దాల్చిన మహిళ ఎన్నికల్లో పోటీకి అర్హురాలే అవుతారు. (జీవించి ఉన్న పిల్లల లెక్కనే పరిగణిస్తారు). తమ పిల్లలను ఇతరులకు దత్తత ఇచ్చినప్పటికీ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం పోటీ చేసే అభ్యర్థి సొంత పిల్లలుగానే పరిగణిస్తారు. అంటే పై నిబంధనల మేరకు నామపత్రాలు పరిశీలన ఉంటుంది. రేషన్ డీలర్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. అంగన్వాడీ వర్కర్లకు పోటీచేసే అవకాశం కల్పించలేదు. సింగరేణి ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగుల్లో మేనేజింగ్ ఏజెంట్, మేనేజర్, సెక్రటరీలు మినహా మిగతా ఉద్యోగులు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. మతి స్థిమితంలేని వ్యక్తి అని నిరూపణ అయితే అతని నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరిస్తారు. ఒక వ్యక్తి క్రిమినల్ కోర్టు ద్వారా దోషిగా నిర్ధారణ అయితే అతని ఆ రోజు నుంచి ఐదేళ్లు స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా పరిగణిస్తారు. పై కోర్టులో అప్పీలు చేసుకున్నా కింది కోర్టు తీర్పుపై స్టే ఇవ్వకుండా అతనికి బెయిల్ ఇచ్చినా కూడా పోటీకి అనర్హుడే అవుతాడు.
Admin
Abhi9 News