Abhi9 News - క్రైమ్ వార్తలు / సంగారెడ్డి : అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరంగూడలో దారుణం జరిగింది. తమ కూతురిని ప్రేమిస్తున్నాడనే కారణంతో ఓ యువకుణ్ని ఇంటికి పిలిపించి హతమార్చారు యువతి తల్లిదండ్రులు. అసలేం జరిగిందంటే... జ్యోతి శ్రావణ్ సాయి అనే 20 ఏళ్ల యువకుడు.. మైసమ్మగూడలోని సెయింట్ పీటర్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. కుత్బుల్లాపూర్లో రూమ్ తీసుకుని అక్కడి నుంచి రోజూ కాలేజీకి వెళ్లివస్తున్నాడు. ఇతను.. బీరంగూడకు చెందిన శ్రీజ అనే 19 ఏళ్ల యువతితో కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరూ పదో తరగతి వరకూ కలిసి చదువుకోవడంతో సాన్నిహిత్యం ఏర్పడి.. ప్రేమకు దారితీసినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి ఇరువురినీ పలుమార్లు హెచ్చరించారు శ్రీజ తల్లిదండ్రులు. అయినా వినిపించుకోకపోవడంతో ఆగ్రహించిన యువతి తల్లిదండ్రులు.. పెళ్లి చేస్తామని నమ్మించి, మాట్లాడుకుందామని చెప్పి సాయిని ఇంటికి పిలిపించారు. దీంతో ఆ యువకుడు శ్రీజ నివాసానికి వెళ్లాడు. అక్కడికి వెళ్లగానే.. ఒక్కసారిగా యువతి కుటుంబ సభ్యులు అతడిపై దాడికి పాల్పడి హతమార్చారు. విషయం తెలుసుకున్న అమీన్పూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Admin
Abhi9 News