Abhi9 News - క్రైమ్ వార్తలు / : సైబర్ మోసాల కేసుల్లో కీలక పాత్రధారులు తప్పించుకుంటున్నారు. నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలను ఇచ్చిన వారిని మాత్రమే పోలీసులు అరెస్టు చేయగలుగుతున్నారు. ఈ క్రమంలో సైబర్ క్రైం విభాగం(Cyber Crime Division) దర్యాప్తు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేలాది మంది జీవితాంతం పొదుపు చేసిన డబ్బును సైబర్ నేరగాళ్లు క్షణాల్లో దోచేసుకుంటున్నారు. దేశ,విదేశాల్లో తమ కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉన్నారు. నేరాలకు పాల్పడే ప్రధాన సూత్రధారులకు బ్యాంకు ఖాతాలను సమకూర్చిన వారిని (మధ్యవర్తులు) మాత్రమే పోలీసులు అరెస్టు చేసి కేసులు మూసివేస్తున్న పరిస్థితి నెలకొంది. నేరగాళ్లు విదేశీ సర్వర్లు, వాయిస్ ఓవర్ ఐపీ కాల్స్, క్రిప్టో వాలెట్ల ద్వారా మోసాలు చేస్తున్నారు. వీరిని గుర్తించి పట్టుకోవడం సాంకేతికంగా కష్టమవుతుండడంతో దర్యాప్తు అక్కడితోనే ఆగిపోతోంది. మ్యూల్ అకౌంట్లు సైబర్ మోసాల్లో చిన్న భాగమే సైబర్ మోసాల్లో డబ్బు లావాదేవీల కోసం మధ్యవర్తులుగా పనిచేసే బ్యాంకు ఖాతాదారులు కేవలం ఒక చిన్న లింక్ మాత్రమే. అసలు నేరగాళ్లను గుర్తించకుండా కేసులు ముగియడంతో బాధితులకు న్యాయం జరగడం లేదు. ముఖ్యంగా బ్యాంకు ఖాతాలు ఇస్తున్న వారిలో చాలా మంది నిరుద్యోగులు, తక్కువ మొత్తంలో ఇచ్చే కమీషన్లకు ఆశపడే వారు ఉంటున్నారు. వారే పోలీసులకు చిక్కుతున్నారు. సూత్రధారులు మాత్రం సిమ్కార్డులను మార్చుతూ, తప్పుడు డాక్యుమెంట్లు, విదేశీ సర్వర్ల నుంచి ఆపరేట్ చేస్తూ పోలీసులకు చిక్కడం లేదు. ఆధునిక టెక్నాలజీ కొరత సైబర్ నేరాల విచారణకు ఆధునిక టెక్నాలజీ కొరత, నిపుణుల లేమి అడ్డంకిగా మారుతున్నాయి. విభిన్న రాష్ట్రాలు, దేశాల పరిధిలో ఉండి మోసాలకు పాల్పడుతున్న వారిని పట్టుకోవడం అసాధ్యంగా మారుతోందని సైబర్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ తరుణంలో ప్రొఫెషనల్ ఫోరెన్సిక్ టీమ్లు ఏర్పాటు చేయాలని, అంతర్జాతీయ ఏజెన్సీలతో సమన్వయం పెంచుకోవాలని, డిజిటల్ ఫుట్ప్రింట్లను అన్వేషించే ఆధునిక సాధనాలను ఉపయోగించడం వంటివి చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
Admin
Abhi9 News