Abhi9 News - జాతీయ వార్తలు / : డీజీపీ శివధర్రెడ్డి ఎదుట మావోయిస్టు ముఖ్య నేతలు లొంగిపోయారు. ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడారు. కుంకటి వెంకటయ్య అలియాస్ వికాస్, మొగిలిచర్ల వెంకట్రాజు అలియాస్ చందు, తోడెం గంగ అలియాస్ సోనీ (ఛత్తీస్గఢ్) మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారని తెలిపారు. ముగ్గురు మావోయిస్టు పార్టీలో రాష్ట్ర కమిటీ స్థాయి నాయకులు అన్నారు. సిద్దిపేట జిల్లాకు చెందిన కుంకటి వెంకటయ్య 1990లో పీడబ్ల్యూడీ ఏర్పాటు చేసిన రైతు కూలీ సభలకు హాజరై అదే ఏడాది అజ్ఞాతంలోకి వెళ్లారని చెప్పారు. పిడబ్ల్యూడీ కమాండర్ బాలన్న ఆధ్వర్యంలో దళంలో చేరారని తెలిపారు. తర్వాత అంచెలంచెలుగా ఎదిగి 35 ఏళ్లపాటు వివిధ హోదాల్లో పనిచేశారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపును అందుకుని జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. హనుమకొండ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామానికి చెందిన మొగిలిచర్ల వెంకటరాజు (45) 11 ఏళ్ల వయసులోనే విప్లవగీతాలకు ఆకర్షితుడై మావోయిస్టు ఉద్యమంలో చేరారని చెప్పారు. 1993లో నర్సంపేట దళంలో రిక్రూట్ అయి రాష్ట్రస్థాయి కమిటీలో వివిధ హోదాల్లో పనిచేశారని తెలిపారు. మావోయిస్టులతో వచ్చిన సైద్ధాంతిక విభేదాల కారణంగా, పోలీసులు ఇచ్చిన పిలుపును అందుకుని అతడి భార్య తోడెం గంగతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారని తెలిపారు. ఇటీవల కాలంలో 403 మంది మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారని డీజీపీ తెలిపారు.
Admin
Abhi9 News